హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 5న ముషీరాబాద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 5న ఉదయం బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.అప్పటికే ఫుడ్ కోర్టు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్ట్ మూసివుండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
