జూనియర్ ఎన్టీఆర్‌కు మేజర్ సర్జరీ.. ఆగస్టు 12న కిమ్స్‌లో ఆపరేషన్!

జూనియర్ ఎన్టీఆర్‌కు మేజర్ సర్జరీ.. ఆగస్టు 12న కిమ్స్‌లో ఆపరేషన్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించి కీలక హెల్త్ అప్‌డేట్ వెలువడింది. ఇటీవల భుజానికి గాయమైన తారక్.. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో బుధవారం, ఆగస్టు 12న ఈ సర్జరీ జరగనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించినట్లు సమాచారం.

కొంతకాలంగా సినిమా షూటింగ్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు ఎన్టీఆర్..  సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి, కోలుకునే విధానానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఆయన టీమ్ తెలిపింది. దీంతో తారక్ అభిమానుల్లో ఒకవైపు ఆందోళన కనిపిస్తుండగా.. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇక ఈ గాయం కారణంగా ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్' షూటింగ్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ లుగర్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.  ఈ మూవీలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1967 నేపథ్యంలోని ఓ క్రైమ్-యాక్షన్ ప్రపంచాన్ని గ్లింప్స్ పరిచయం చేసింది. ఈ సినిమా 2027 జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రస్తుతం 'డ్రాగన్' టీమ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్న సమయంలో ఎన్టీఆర్‌కు గాయం కావడంతో షూటింగ్ షెడ్యూల్‌పై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నటుడి ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని, వైద్యుల సూచనల మేరకే తదుపరి షూటింగ్ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు అభిమానులను అలరించిన 'మ్యాన్ ఆఫ్ మాసెస్'.. ఇప్పుడు మరోసారి తన ఫిట్‌నెస్‌తో బౌన్స్ బ్యాక్ కావాల్సిన సమయం వచ్చింది. సర్జరీ విజయవంతంగా పూర్తై తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.