మద్యం మత్తులో తల్లిని చంపిన కొడుకు

మద్యం మత్తులో తల్లిని చంపిన కొడుకు

షాద్ నగర్, వెలుగు : మద్యం మత్తులో ఓ కుమారుడు తన తల్లిపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఫరూఖ్ నగర్ లోని కంసాన్ పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.  షాద్ నగర్ సీఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం..కంసాన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ(60) కుమారుడు నర్సింహులు(36) మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నాడు. నర్సింహులు మూడేళ్ల క్రితం తన భార్య మంజులపై గొడ్డలితో దాడి చేయగా..ఆమె గాయపడింది. ఈ కేసులో జైలుకెళ్లిన నర్సింహులును తల్లి వెంకటమ్మ బెయిల్ పై బయటికి తీసుకువచ్చింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్న నర్సింహులు మళ్లీ మద్యానికి బానిసై భార్య మంజుల, తల్లి వెంకటమ్మతో గొడవపడటం మొదలుపెట్టాడు.

ఆదివారం రాత్రి 9.30గంటలకు తాగి ఇంటికి వచ్చిన నర్సింహులు మరోసారి వెంకటమ్మతో గొడవపెట్టుకున్నాడు. వెంకటమ్మ కుమారుడు నర్సింహులును మందలించింది. దీంతో నర్సింహులు అర్ధరాత్రి వెంకటమ్మ నిద్రపోతుండగా..ఆమెపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటమ్మ అక్కడిక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం షాద్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించారు. వెంకటమ్మ కూతురు అంజమ్మ కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.