
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ క్వార్టర్లో ఎనిమిది నగరాల్లో మొత్తం 80,250 ప్రాపర్టీ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో 74,320 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెసిడెన్షియల్ యూనిట్లు కొత్త సరఫరాలు 11 శాతం పెరిగాయి. అమ్మకాలు ఎనిమిది శాతం వార్షిక వృద్ధిని సాధించాయని ప్రాప్టైగర్ డేటా తెలిపింది. ఈ సంస్థ రిపోర్టుల్లోని మార్కెట్లలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ-–ఎన్సీఆర్, పూణే ఉన్నాయి.
2023 క్యూ2లో మొత్తం అమ్మకాలలో 61 శాతం వాటా ముంబై, పూణే నుంచి ఉండటం విశేషం. అయితే అహ్మదాబాద్, పూణేలో మాత్రమే అమ్మకాలు పెరగగా, మిగతా నగరాల్లో తగ్గాయి. ఈ క్వార్టర్లో రియల్టర్లు 1,13,770 రెసిడెన్షియల్ యూనిట్లను ప్రారంభించారు. 2022 ఏప్రిల్-–జూన్ క్వార్టర్లో అందుబాటులోకి వచ్చిన1,02,140 యూనిట్లతో పోలిస్తే సరఫరాలో 11 శాతం పెరుగుదల ఉంది. కొత్త సరఫరాల్లో ముంబై ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత పూణే, అహ్మదాబాద్ ఉన్నాయి. రెపోరేటు పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రాపర్టీలను కొనుగోలు చేయడం పెరిగిందని ప్రాప్టైగర్ తెలిపింది.
ఎత్తైన భవనాలు ముంబైలోనే ఎక్కువ...
భారతదేశంలోని ఎత్తైన భవనాలలో 77శాతం ముంబైలో ఉన్నట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ వెల్లడించింది. ఇది ఇక నుంచి కూడా నంబర్వన్గా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడ ధరలు చాలా ఎక్కువ. అందుకే ముంబైలో బిల్డింగుల ఎత్తు ఎక్కువగా ఉంటుందనీ సీబీఆర్ఈ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా, అత్యధిక ఎత్తైన భవనాలు ఉన్న నగరాల్లో ముంబై 17వ స్థానంలో ఉంది. ఆసియాలో 14వ స్థానంలో ఉంది. 150మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నదానిని ‘టాల్ బిల్డింగ్’ కేటగిరీలో చేర్చుతారు. ఇతర నగరాలలో, హైదరాబాద్, కోల్కతా, నోయిడాలలో వరుసగా 8 శాతం, 7 శాతం 5 శాతం ఎత్తైన భవనాలు ఉన్నాయి. గుర్గావ్, బెంగళూరు, చెన్నైలు తరువాతి స్థానాల్లో ఉన్నాయని సీబీఆర్ఈ పేర్కొంది.