
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో అప్పుల బాధ తాళలేక మద్యం మత్తులో ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం (june 13) రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గందమల్ల రవి(38), భార్య గందమల్ల నవితతో కలిసి యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో పని చేస్తున్నాడు.
బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించకపోవడంతో.. ఇటీవల బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. అలాగే సొంత ఊళ్లో కూడా అప్పులు చేయడంతో.. వారు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పులు తీర్చే దారిలేక తాను నివాసం ఉంటున్న బీర్ల నిలయంపై ఉన్న రేకుల షెడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య గందమల్ల నవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడి ఫ్యామిలీని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పరామర్శించారు. సైదాపురంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు..
ఎమ్మెల్యే ఇంటిపై రవి ఉరేసుకోవడంతో, ఈ ఘటనను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అంటగడుతూ తప్పుడు కథనాలు, వార్తలు ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
భువనగిరిలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్టలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడుకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై విచారణ చేపట్టి నిజాలు ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా మీడియా సమావేశాల్లో డిమాండ్
చేశారు.
కేసు నమోదు..
ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి సూసైడ్ చేసుకున్న ఘటనను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అపాదిస్తూ అసత్య కథనాలు ప్రసారం చేసిన సంస్థలు, వ్యక్తులపై యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేసిన తెలుగు స్రైబ్ అడ్మిన్, శ్రవణ్ కుమార్ హిందు, శివారెడ్డి సీటీవీపై కేసు ఫైల్ చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రసారం చేస్తే.. ఏ స్థాయి వ్యక్తులున్నా ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.