అల్వాల్లో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధమున్న ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుణ్ని కిరాతకంగా కొట్టి చంపాడు ఓ వ్యాపారవేత్త . పది రోజుల పాటు అతడిని చిత్రహింసలకు గురి చేసి, ఆ తర్వాత చంపి శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కనకరాజ్ అనే వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడిని చంపేశాడు . కనకరాజ్తో వివాహేతర సంబంధమున్న యువతిని శ్రీకాంత్రెడ్డి తీసుకు వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో వారిద్దర్నీ జవహర్ నగర్ లోని ఒక ఇంట్లో బంధించిన కనకరాజు.. శ్రీకాంత్ రెడ్డిని చిత్రహింసలకు గురిచేశాడు. 10 రోజుల పాటు హింసించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత మద్యం మత్తులో శ్రీకాంత్ ను హత్య చేశానంటూ కనకరాజు తన మిత్రులతో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు కనకరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన కార్యకర్తగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.