ఇప్పుడే ఉద్యోగులు అందరూ ఇళ్లకు వెళ్లిపోండి: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అలర్ట్

ఇప్పుడే ఉద్యోగులు అందరూ ఇళ్లకు వెళ్లిపోండి: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అలర్ట్

హైదరాబాద్ సిటీ పరిధిలోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. 2026, జూన్ 22వ తేదీ సోమవారం సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని.. సైబరాబాద్ పరిధిలో పని చేసే ఐటీ, ఇతర ఉద్యోగులు అందరూ త్వరగా ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

భారీ వర్షంతో ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశం ఉండటంతో.. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచే విడతల వారీగా అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. 

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంటే గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్ చెరు, నార్సింగ్, అమీన్ పూర్, కూకట్ పల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఆర్సీ పురం ఏరియాలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెదర్ అలర్ట్ జారీ చేశారు. 

ఉద్యోగుల భద్రత, రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా, అత్యవసర సేవలకు ఆటంకాలు కలగకుండా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచే ఉద్యోగులకు దశలవారీగా ఎర్లీ లాగౌట్లు కల్పించాలని సైబరాబాద్ పోలీసులు అన్ని కంపెనీల యాజమాన్యాలకు సూచన చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదాలను తగ్గించడం, రోడ్లపై రద్దీని నియంత్రించడం, అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.