
త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థుల లిస్టును ఆ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలో దిగనున్నారు. పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పోటీ చేయనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసి ప్రతిపక్షాలకు ఊహించని షాకిచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 61 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చామన్నారు కేజ్రీవాల్. 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాత స్థానాల్లో పోటీ చేస్తారని తెలిపారు. 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేశామన్నారు. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళలకు సీట్లు ఇవ్వగా.. ఈసారి 8 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని చెప్పారు. 9 అసెంబ్లీ స్థానాల్లో కొత్తవాళ్లకు టికెట్లు కేటాయించినట్లు తెలిపారు.