ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడంపై నిరసన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కమల్ సురేశ్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మన ఊరు మన బడి’పేరుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని చెప్పి, ఆచరణలో రాష్ట్ర సర్కార్ ఫెయిలైందని మండిపడ్డారు. ఇప్పటికీ స్కూళ్లకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదని, నిర్వహణ నిధులివ్వలేదని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులు, డొనేషన్లు, బుక్స్, యూనిఫామ్స్ పేర్లతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగే స్కూళ్ల బంద్కు స్టూడెంట్లు, పేరెంట్స్ మద్దతు ఇవ్వాలని కోరారు.
నేడు ఎస్ఎఫ్ఐ చలో కలెక్టరేట్.. స్కూళ్లల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ‘చలో కలెక్టరేట్’కు పిలుపునిచ్చింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు తెలిపారు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించేందుకు చట్టం తీసుకురావాలని, సర్కారు స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ హాస్టళ్లలో అడ్మిషన్లకు ఆన్లైన్ పద్ధతిని రద్దు చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు. ‘మన ఊరు మన బడి’కింద అన్ని స్కూళ్లను ఒకేసారి అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు.