అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం

అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
  • వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి    
  • సుంకిశాల ప్రాజెక్టు పనుల పరిశీలన 

హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ లో కొనసాగుతున్న ఎమర్జెన్సీ పంపింగ్ పనులను వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి, ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. పంపింగ్ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర వాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సాగర్ జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేస్తున్నామన్నారు. పంపింగ్ ప్రక్రియలో  ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సాగర్​నీటి మట్టం ఇంకా తగ్గితే, రెండో దశ పంపింగ్ ఏర్పాటు చేసి, నీటిని తరలిస్తామన్నారు.

సబ్ మెర్సబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అందుకు సంబందించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. వాటర్​బోర్డు పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో తాగునీటి సరఫరా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం సిటీకి 580 ఎంజీడీల నీటి సరఫరా చేస్తున్నట్టు వివరించారు. వివిధ సోర్సుల నుంచి గతేడాది  కంటే 20 ఎంజీడీలు అదనంగా అందించామన్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక సరఫరా అని వెల్లడించారు. అనంతరం ఎండీ సుదర్శన్ రెడ్డి సుంకిశాల ప్రాజెక్టును సందర్శించారు.

ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పైప్​లైన్ పనుల్ని పరిశీలించారు. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపు లైన్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ప్రాజెక్టును సెప్టెంబరు లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎండీ సుదర్శన్​రెడ్డి అధికారులను ఆదేశించారు.

సాధారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజీలో 25 టీఎంసీలు, 510 అడుగుల నీరు ఉన్నంత వరకు వాడుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఎండీ వెంట టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ట్రాన్స్ మిషన్  సీజీఎం దశరథ్ రెడ్డి, జీఎం శ్రీధర్ రెడ్డి, ప్రాజెక్టు, ట్రాన్స్ మిషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.