తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు.. ఆర్టీఏ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు.. ఆర్టీఏ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది ఏసీబీ.  ఇవాళ(జూన్ 26న) రాష్ట్ర వ్యాప్తంగా  పలు  జిల్లాల్లోని 18 ఆర్టీఏ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తోంది ఏసీబీ.  పెద్దపల్లి, కామారెడ్డితో పాటు  హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిధిలోని  ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఉదయం నుంచి సోదాలు చేస్తోంది.ఆర్టీఏ కార్యాలయాల్లో గేట్లు మూసివేసి అందరిని బయటకు పంపిస్తున్నారు  ఏసీబీ అధికారులు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ  ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నారు.

తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో గత కొంతకాలంగా ఏజెంట్ల ఆగడాలు శృతిమించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకొని సోదాలను నిర్వహిస్తున్నారు. ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుండి సెల్ ఫోన్లు, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. 18 మంది ఏజెంట్లు కార్యాలయంలో అక్రమంగా వాహనాల లైసెన్సుల జారీ విషయంలో కమిషన్లు తీసుకుంటూ అక్రమ దందాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సిబ్బందిని బయటికి పంపించి సోదాలు చేస్తున్నారు అధికారులు.రెండు బృందాలుగా రెండు కార్యాలయాల్లో ఏసీబి అధికారుల సోదాలు  చేస్తున్నారు.  రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఏసీబీ దాడుల కారణంగా లైసెన్స్ కోసం వచ్చిన కార్యాలయాల ఎదుట ఎదురుచూస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా  ఏజెంట్లు ఆర్టీఏ ఆఫీసుల దగ్గర వాహనదారుల నుంచి భారీగా దోచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో RTA కార్యాలయాల్లో ఏజెంట్స్ ద్వారా జరిగే అవినీతిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏసీబీ ఇవాళ  ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది.