
ప్రముఖ స్టార్ హీరో అర్జున్ మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు. ఆమె వయసు85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లక్ష్మీ దేవమ్మ... నేడు చనిపోవడంతో అర్జున్ కుటుంబంలో విషాదం నెలకొంది. మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పలు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన రవితేజ ‘ఖిలాడి’ చిత్రంతో అలరించిన ఆయన... ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఆయన డైరెక్ట్ చేస్తున్న మొదటి మూవీ ఇదే. అయితే ఈ మూవీలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సార్జా హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.