హీరోయిన్ ను కత్తితో పొడిచిన నిర్మాత

హీరోయిన్ ను కత్తితో పొడిచిన నిర్మాత

సినీనటి, టీవీ షో ప్రజెంటర్ మాల్వీ మల్హోత్రాపై నిర్మాత యోగేశ్ కుమార్ మహిపాల్ సింగ్ కత్తితో దాడి చేశారు. ఆమె కడుపులో మూడు సార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ముంబైలోని కోకిలాబెన్  ఆస్పత్రిలో చికిత్ప పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలుగులో ‘కుమారి 18+’ అనే సినిమాలో మాల్వీ నటించింది. హిందీ, మలయాళం చిత్రాల్లో కూడా నటించింది.

ఒక ప్రొడక్షన్ పని కోసం గత ఏడాది మాల్వీని యోగేశ్ కుమార్ కలిశారు. ఇటీవలే ఆమె దగ్గర పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. అయితే అతని ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది. దీంతో నిన్న(సోమవారం) రాత్రి ముంబై వెర్సోవా ప్రాంతంలోని  ఓ కేఫ్ నుంచి  ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో ఆమెకు ఎదురుగా కారులో వచ్చిన యోగేశ్… మాల్వీతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతనితో మాట్లాడేందుకు మాల్వీ నిరాకరించడంతో కత్తితో మూడు సార్లు పొడిచి పారిపోయాడు. ఆమె కడుపు, కుడిచేతి మణికట్టు, ఎడమ చేతికి గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన మాల్వీని స్థానికులు కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.2019లో ఫేస్ బుక్ ద్వారా యోగేశ్ తనకు పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాల్వీ తెలిపింది. తన  దగ్గర పెళ్లి ప్రపోజల్ తీసుకురాగానే ఆయనను దూరం పెట్టానని చెప్పింది. మరోవైపు మాల్వీని కత్తితో పొడిచిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.