- ఫ్రీ బస్సు జర్నీ, రుణమాఫీ వంటి స్కీమ్లకు అడోబ్ సీఈవో శంతను నారాయణ్ ప్రశంస
- రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడం ఖాయం
- రెండేండ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు అద్భుతం
- యువతకు ఏఐ, డిజిటల్ లిటరసీ పెంచేందుకు పనిచేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లలో చేపట్టిన సంస్కరణలు, పథకాలు అద్భుతమని ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం, ‘అడోబ్’ సీఈవో శంతను నారాయణ్ కొనియాడారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలు సామాన్యుల బతుకుల్లో వెలుగులు నింపే ‘లైఫ్ లైన్స్’ అని తెలిపారు. మంగళవారం ‘తెలంగాణ రైజింగ్ –2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం చాలా గొప్పగా ఉందని ప్రశంసించారు. ‘‘ఇది సాహసోపేతమైన లక్ష్యమే అయినప్పటికీ.. తెలంగాణ ప్రజల పట్టుదలతో కచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పటికీ నన్ను నేను హైదరాబాదీగానే భావిస్తాను. ఇక్కడి హెచ్పీఎస్, ఉస్మానియాలో చదువుకున్నా. మా తల్లిదండ్రులు ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉండటం గర్వంగా ఉంది. యువతకు ఏఐ, డిజిటల్ లిటరసీలో నైపుణ్యాలు పెంచేందుకు అడోబ్ తరఫున ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు ద్వారా తెలంగాణ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆలోచనలు స్ఫూర్తిదాయకం: ప్రేమ్ వత్స
‘‘పెట్టుబడులను ఆకర్షించడం.. యువత, మహిళలు, రైతులను సాధికారికంగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు స్ఫూర్తిదాయకం. వ్యాపారానికి ఏది మంచిదో.. అది రాష్ట్రానికి కూడా మంచిదే అనే సూత్రం ఇక్కడ కనిపిస్తున్నది” అని ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అధినేత ప్రేమ్ వత్స తెలిపారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. తాను హెచ్పీఎస్లో చదువుకున్నానని, 2047 నాటికి రేవంత్ నాయకత్వంలో అద్భుతాలు సృష్టిస్తుందని ఆకాంక్షించారు.
