ఫోన్ కొనే స్థోమత లేక స్టూడెంట్ ఆత్మహత్య

ఫోన్ కొనే స్థోమత లేక స్టూడెంట్ ఆత్మహత్య

కొడిమ్యాల, వెలుగు: ఆన్లైన్ క్లాసులు కుటుంబంలో విషాదం నింపాయి. మొబైల్ కొనే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో మనస్తాపం చెందిన 9వ తరగతి స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మంకు స్వామికి కొడుకు రఘుప్రసాద్(14), కూతురు షర్మిల(13) ఇద్దరు పిల్లలు. రఘు స్థానిక మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూళ్లు స్టార్ట్చేయకుండా ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. అయితే ఇంట్లో మొబైల్ ఫోన్ లేక రఘు ఇబ్బంది పడుతున్నాడు. కొద్ది రోజులుగా మొబైల్ కొనివ్వమని అడుగుతున్నా పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు వాయిదా వేస్తూ వచ్చారు. మనస్తాపానికి గురైన రఘు ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.