V6 News

అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఏం జరిగింది? అన్నెసీ ఫెస్టివల్‌లో 'ది ఎటర్నల్ వార్' సంచలనం!

 అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఏం జరిగింది?  అన్నెసీ ఫెస్టివల్‌లో 'ది ఎటర్నల్ వార్' సంచలనం!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం 'బాహుబలి'.  ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ దృశ్య కావ్యం, వెండితెరపై సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' (Baahubali: The Eternal War) అనే త్రీడీ యానిమేషన్ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2026 (ఫ్రాన్స్)లో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' కేటగిరీకి ఎంపికై చరిత్ర సృష్టించింది.

కథా నేపథ్యం..

సాధారణంగా బాహుబలి అంటే మనకు మాహిష్మతి సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది. కానీ, 'ది ఎటర్నల్ వార్' కథ అంతకు మించి ఉంటుంది. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. మరణానంతరం బాహుబలి ఆత్మ 14 మిస్టికల్ లోకాల గుండా ప్రయాణిస్తూ, దేవతలు, అసురుల మధ్య జరిగే ఒక బ్రహ్మాండమైన 'కాస్మిక్ యుద్ధం'లో ఎలా భాగమైందనేది ఈ చిత్ర ప్రధానాంశం. భారతీయ పురాణాలను, హై-ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కలిపి దర్శకుడు ఇషాన్ శుక్ల అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ గళం.. కీరవాణి సంగీతం!

ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం ఒరిజినల్ స్టార్ కాస్ట్ తిరిగి రావడం. బాహుబలి పాత్రకు రెబల్ స్టార్ ప్రభాస్, శివగామి పాత్రకు రమ్యకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు, ఇది ప్రేక్షకులకు వెండితెర బాహుబలి అనుభూతిని మళ్ళీ గుర్తు చేయనుంది. ఆర్కా మీడియా వర్క్స్ దాదాపు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా అత్యున్నత సాంకేతికతతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

యానిమేషన్ రంగంలో నవ శకం

అన్నెసీ ఫెస్టివల్‌ను యానిమేషన్ రంగంలో 'కాన్స్' (Cannes) చలనచిత్రోత్సవంతో పోలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమర్శకులు, దిగ్గజ యానిమేషన్ సంస్థలు ఈ సినిమా విజువల్స్‌ను తొలిసారిగా అక్కడ వీక్షించనున్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ యానిమేషన్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే ఒక ప్రయోగం.

2027లో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రంలో పార్ట్-1 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. లైవ్ యాక్షన్ సినిమాల్లో రాజమౌళి ఎలాగైతే బెంచ్‌మార్క్ సెట్ చేశారో, ఈ యానిమేషన్ చిత్రంతో 'బాహుబలి' బృందం అంతర్జాతీయ స్థాయిలో మరో మైలురాయిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి..