- టీమిండియాను భయం లేని జట్టుగా తీర్చిదిద్దారన్న రహానే
- టెస్ట్ల్లోనూ దూకుడును తీసుకొచ్చారు
- ప్రస్తుత టెస్ట్లు భయాన్ని కలిగిస్తున్నాయి
- మిగిలిన సీనియర్లను గౌరవించాలి
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్గా నియమించడం ఇండియా క్రికెట్లో కీలక మలుపు అని మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. కోహ్లీతో పాటు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి జట్టు ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశారన్నాడు. ముఖ్యంగా విదేశీ పరిస్థితుల్లో టీమిండియాను భయం లేని జట్టుగా తీర్చిదిద్దారని కితాబిచ్చాడు. ‘2014–15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీ మధ్యలో మహీ రిటైర్ అయ్యాడు. అప్పుడు కోహ్లీ కెప్టెన్గా పగ్గాలు తీసుకున్నాడు. ఆ టైమ్లోనే విరాట్, రవి ఇండియా క్రికెట్ను మరింత పటిష్టం చేశారు. టెస్ట్ల్లోనూ దూకుడుగా ఆడటం పరిచయం చేశారు. ఇది ఇండియాను ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన విదేశీ జట్లలో ఒకటిగా నిలబెట్టింది’ అని రహానే పేర్కొన్నాడు.
రక్షణాత్మక ధోరణికి గుడ్బై
కోహ్లీ రాక ముందు వరకు టెస్ట్ల్లో ఇండియా రక్షణాత్మక ధోరణితోనే ఆడేదని రహానే అన్నాడు. ప్లేయర్లు కూడా అదే ఆలోచనతో ఉండేవారన్నాడు. ‘టెస్ట్ల్లోనూ స్వేచ్ఛగా ఆడేలా కోహ్లీ, శాస్త్రి ప్రోత్సహించేవారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఫెయిలైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దాంతో మేం రక్షణాత్మక ధోరీణిని వీడి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుచూపుతో ఆడేవాళ్లం. ముఖ్యంగా విదేశీ టెస్ట్ల్లో ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడంతో ఎక్కువ విజయాలు సాధించాం. తొలి బాల్ నుంచి దాడి చేయాలనిపిస్తే అలాగే చెయ్యి అని విరాట్ నాకు ఎప్పుడూ చెప్పేవాడు. నిర్భయంగా ఆడటానికి ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. అందుకే ఈ ఘనత కోహ్లీ, శాస్త్రికే చెందుతుంది’ అని రహానే వెల్లడించాడు. కోహ్లీ మరియు శాస్త్రిల సారథ్యంలో టీమిండియా తన అత్యంత విజయవంతమైన టెస్ట్ శకాల్లో ఒకదాన్ని ఆస్వాదించింది. ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్లను గెలుచుకుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్కు అర్హత
సాధించింది.
ఇప్పటి టెస్ట్లపై ఆందోళన..
ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్ పయనంపై రహానే ఆందోళన వ్యక్తం చేశాడు. ఇండియా టీమ్ ఇటీవల ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరుండి చూడటం నిరాశ కలిగించిందన్నాడు. ‘గత రెండేళ్లుగా టెస్ట్ క్రికెట్ ఆడకపోవడంతో ఇంట్లో కూర్చొని మ్యాచ్లు చూస్తున్నా. స్వదేశంలో కూడా ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయా. అందుకే టెస్ట్ క్రికెట్కు పట్టుదల ఎక్కువ అవసరమని నాకు అనిపించింది. ప్లేయర్లు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. మానసిక ధృడత్వం, పోటీతత్వ క్రికెట్ చాలా ముఖ్యమైనవి.
సెషన్ల వారీగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లను విసిగించేలా గేమ్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలి’ అని రహానే వివరించాడు. ప్రత్యేకంగా ఏ జట్టు పేరు చెప్పకుండా.. టెస్ట్ మ్యాచ్లోని కఠినమైన దశలను తట్టుకోవడానికి అవసరమైన సహనాన్ని ఆధునిక క్రికెటర్లు నానాటికీ కోల్పోతున్నారన్నాడు. వెంటనే దీనికి ఫుల్స్టాఫ్ పెట్టాలన్నాడు. ఇది జరగాలంటే టెస్ట్ జట్టులో ఎక్కువమంది సీనియర్లు ఉండాలని సూచించాడు. ‘టెస్ట్ టీమ్లో 7, 8 మంది సీనియర్లు ఉండాలి. ఇద్దరు లేదా ముగ్గురు యంగ్స్టర్స్ను తీసుకోవాలనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు జట్లన్నీ కొత్త వాళ్లతో నిండిపోతున్నాయి. దాదాపుగా సీనియర్లందరూ రిటైర్ అయ్యారు. మిగిలిన అనుభవజ్ఞులైన ప్లేయర్లను గౌరవించడం చాలా అవసరం. ప్రస్తుత పోకడలను చూస్తే టెస్ట్లకు గడ్డు కాలం నడుస్తోంది. ఈ ఫార్మాట్ మనుగడ సాధించాలని అందరూ కోరుకోవాలి. ముఖ్యంగా ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్లో టెస్ట్ క్రికెట్ కొనసాగాలని కోరుకుందాం’ అని రహానే వ్యాఖ్యానించాడు.
