బయటికొచ్చిన అజిత్ పవార్ లాస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్.. దాదా ఎవరితో ఏం మాట్లాడారంటే..?

బయటికొచ్చిన అజిత్ పవార్ లాస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్.. దాదా ఎవరితో ఏం మాట్లాడారంటే..?

ముంబై: దివంగత నేత అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ క్రమంలో ప్రమాదానికి నిమిషాల ముందు అజిత్ పవార్ ఎవరితో ఫోన్ మాట్లాడారు..? ఏం మాట్లాడారు..? అనే విషయాలు బయటికొచ్చాయి. ఈ ప్రమాదానికి సరిగ్గా ఎనిమిది నిమిషాల ముందు అజిత్ పవార్ తన మేనల్లుడు శ్రీజిత్ పవార్‎తో ఫోన్ కాల్ మాట్లాడారు. బారామతి జిల్లా పరిషత్ స్థానానికి ఎన్సీపీ జెడ్పీ అభ్యర్థి ఎంపిక గురించి డిస్కషన్ చేశారు. 

ఈ విషయాన్ని స్వయంగా శ్రీజిత్ పవారే వెల్లడించారు. బుధవారం (ఫిబ్రవరి 4) శ్రీజిత్ మాట్లాడుతూ.. 2026, జనవరి 28 ఉదయం 8.37 గంటలకు బారామతి సమీపంలోని ఖతేవాడి గ్రామాన్ని సమీపిస్తున్నప్పుడు విమానం లోపల నుంచి అజిత్ దాదా తనకు చివరి ఫోన్ కాల్ చేశారని చెప్పారు. సరిగ్గా తనకు కాల్ చేసిన 8 నిమిషాల తర్వాత అంటే ఉదయం 8.45 గంటలకు దాదా ప్రయాణిస్తోన్న విమానం బారామతి ఎయిర్ స్ట్రిప్‎లో కుప్పకూలిందని తెలిపారు. 

బారామతి జిల్లా పరిషత్ స్థానానికి OBC వర్గంలోని మాలి కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిగణించాలని ఈ కాల్‎లో దాదా తనకు చెప్పారని శ్రీజిత్ వెల్లడించాడు. దాదా తన చివరి క్షణాల్లో కూడా అన్ని వెనకబడిన కులాలు, వర్గాలే గురించి ఆలోచించారని.. సామాన్య ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటిదో తెలియజేసేందుకు దాదాతో తాను మాట్లాడిన చివరి కాల్ రికార్డింగ్ ను విడుదల చేశానని తెలిపాడు.