బషీర్బాగ్, వెలుగు: వెలమ కులాన్ని పదేపదే దూషిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అల్ ఇండియా వెలమ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ హిమాయత్నగర్లోని వెలమ భవన్ వద్ద సంఘం నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాసరావు మాట్లాడారు. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని సీఎం వెలమ కులాన్ని అవమానిస్తున్నారని అన్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక కులంపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోట్ల వీణ, కోశాధికారి హరీశ్ రావు, ఈసీ షర్మిల, రత్నాకర్ రావు, దివాకర్ రావు, బల్మూరి జగన్మోహన్ రావు పాల్గొన్నారు.
