మహిళలు రైలు నడుపుతున్న వీడియో వైరల్

మహిళలు రైలు నడుపుతున్న వీడియో వైరల్

మహిళా సాధికారత దిశగా మరో అడుగు అంటూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ షేర్ చేసిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. బెంగళూరు – మైసూర్ మధ్య నడిచే రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను పూర్తిగా మహిళా సిబ్బంది నడుపుతున్న వీడియోను ఆయన ఆదివారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ మహిళలే ఉన్న ఈ వీడియోను కొద్ది గంటల్లోనే వేలాది మంది లైకులు, షేర్లు చేశారు. రైలు ఇంజన్ క్యాబిన్‌లో కూర్చుని ట్రైన్ నడుపుతున్న మహిళలను నెటిజన్ల సూపర్ అంటూ అభినందిస్తున్నారు.

మార్చి 8న జరుపుకోబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ పూర్తిగా మహిళా సిబ్బందితో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ను నడిపించినట్లు ట్వీట్‌లో తెలిపారు రైల్వే మంత్రి గోయల్. ఎంతో నైపుణ్యంతో రైలు నడుపుతున్న మహిళా లోకో పైలట్‌లను చూడండి అంటూ ఆయన వీడియోను పెట్టారు. మహిళా సాధికారత దిశగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

నారీ శక్తికి నెటిజన్ల సెల్యూట్

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, మహిళల ధైర్యాన్ని అభినందిస్తూ నెటిజన్లు చాలా మంది స్పందించారు. గట్టిగా 9 గంటలు గడిచే లోపే ఈ వీడియోను 63 వేల మంది చూశారు. 2500 వేల మంది రీట్వీట్ చేయగా.. 12700 మంది లైక్ చేశారు. సెల్యూట్, నారీ శక్తి జిందాబాద్ అంటూ కొందరు ట్వీట్లు చేశారు. తమలో స్ఫూర్తిని నింపేలా ఉందంటూ ఓ మహిళ కామెంట్ చేసింది. మహిళల శక్తిని చాటారంటూ మరికొందరు వారిని మెచ్చుకున్నారు.