- పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ..!
- రెండు కంపెనీలతో ఓ డాక్టర్ చేతులు కలిపారని ఆరోపణ
- విచారణకుఆదేశించిన డీఎంఈ
- అనుమతులు తీసుకునే చేస్తున్నానన్న డాక్టర్
పిల్లల ఆస్పత్రి నిలోఫర్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. పిల్లలపై నిషేధించిన వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లే దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పీడియాట్రిక్స్ విభాగంలోని ఓ సీనియర్ డాక్టర్, రెండు ఫార్మా కంపెనీలతో కలిసి గుట్టుగా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలియో రాకుండా వేసే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ), స్వైన్ఫ్లూ, రోటా, హెచ్పీవీ, ఎంఆర్ వ్యాక్సిన్లను పిల్లలపై ట్రయల్ చేస్తున్నట్టు ఆరోపించారు. తల్లిదండ్రులకు తెలియకుండా రక్త నమూనాల తీసుకుని రహస్యంగా టెస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ రమేశ్రెడ్డితో పాటు మరికొంతమంది డాక్టర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఐపీవీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని డాక్టర్లు చెబుతున్నారు. దాన్ని పిల్లలపై ప్రయోగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆ రెండు కంపెనీలకు చెందిన ఇద్దరు అమ్మాయిలను తన అసిస్టెంట్లుగా ఆ డాక్టర్ నియమించుకున్నారని, ట్రయల్స్కు సంబంధించిన వివరాలను వాళ్లు నోట్ చేసి కంపెనీకి పంపిస్తున్నారని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. అయితే, సూపరింటెండెంట్కు తెలియకుండా ఆ ఇద్దరు అమ్మాయిలు హాస్పిటల్లో ఎలా పని చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంఈ రమేశ్రెడ్డి విచారణకు ఆదేశించారు. గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చూసిన రోగుల వివరాలు, కేస్ షీట్లను సమర్పించాల్సిందిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. క్లినికల్ ట్రయల్స్ విరాలను రెండ్రోజుల్లోగా తనకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అనుమతులు తీసుకునే చేస్తున్నా..
రోటా, ఎంఆర్ సహా మరో రెండు వ్యాక్సిన్లపై కొంత మంది డాక్టర్లతో కలిసి తాను క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న మాట నిజమేనని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ‘వెలుగు’తో చెప్పారు. అయితే, ట్రయల్స్కు అన్ని అనుమతులూ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఆస్పత్రి ఎథికల్ కమిటీ ఇచ్చిన అనుమతి పత్రాలూ తన దగ్గర ఉన్నాయన్నారు. అన్ని తెలిసీ కొందరు డాక్టర్లు తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ముందు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్ ఎథికల్ కమిటీలో చర్చించి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వ్యక్తిపై ట్రయల్ చేస్తున్నామో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ముందే తెలియజేయాలి. ఆ వ్యక్తిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వీడియోనూ రికార్డ్ చేయాలన్న నిబంధనలూ ఉన్నాయి. ట్రయల్స్ పద్ధతులను క్లినికల్ ట్రయల్స్ ఇండియా అనే సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. అవేవీ లేకుండానే నిలోఫర్లో ట్రయల్స్ జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.