
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ కావడంపై ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ రనౌట్ హర్మన్ దురదృష్టం కాదని..ఆమె బద్దకమని ఘాటుగా విమర్శించింది. రనౌట్ విషయంలో హర్మన్ ప్రీత్ కౌర్ దురదృష్టం కంటే బద్దకమే ఎక్కువగా కనిపిస్తోందని చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కుంటి సాకులు చెప్పొచ్చు కానీ...సరైన సమయంలో సరిగా ప్రయత్నిస్తే హర్మన్ క్రీజు దాటేందని తెలిపింది. రెండు మీటర్లు దాటేందుకు మరింత శ్రమించి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని పేర్కొంది.
మైదానంలోకి దిగితే ఎఫర్ట్ పెట్టాలి..
హర్మన్ ప్రీత్ కౌర్ అలసత్వాన్ని ఆస్ట్రేలియా వాడుకుంది. ప్రతీ విషయానికి దరిద్రం, బ్యాడ్లక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ సమయంలో ఎంతలా ప్రయత్నించామన్నది ముఖ్యం. గెలుపు కోసం ఏం చేశామన్నది కూడా ముఖ్యమే. మైదానంలోకి దిగామంటే వంద శాతం శ్రమపడాల్సిందే. హర్మన్ ఔటవ్వకుండా ఉండాలని అనుకుంటే డైవ్ చేయాల్సింది. వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. చిన్న చిన్న తప్పిదాలు ప్రత్యర్థికి కలిసి వస్తాయనే అవగాహన ఉండాలి. పెద్ద టోర్నీల్లో గెలవాలంటే ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు. సాధారణంగా ఈ తరహా సందర్భాలు ఎదురైనప్పుడు నేను స్టంప్స్ను పడేసి సమయాన్ని వృథా చేయను. కానీ హర్మన్ ప్రీత్ అలసత్వాన్ని ముందే గ్రహించి స్టంప్స్కి బాల్ ను తాకించాను. ఆమె ఈజీగా రన్ తీయొచ్చు అని రిలాక్స్ అయింది. ఈ తప్పిదాన్ని వాడుకొని మేం విజయం సాధించాం. 'అని అలిస్సా హిలీ చెప్పుకొచ్చింది.
మహిళల టీ20 ప్రపంచకప్లో ఈసారి కూడా టీమిండియాకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈజీగా గెలిచే మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్, పేలవ బ్యాటింగ్తో టీమిండియా ఓడిపోయింది. ముఖ్యంగా కీలక సమయంలో హర్మన్ప్రీత్ కౌర్ రనౌటవ్వడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది.