హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమెజాన్ బజార్ సేవలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్డర్లు గత ఏడాది కాలంలో 4 రెట్లు పెరిగాయని, ముఖ్యంగా హైదరాబాద్లో కొత్త కస్టమర్ల సైన్-అప్లు 4 రెట్లు పెరగడమే కాకుండా, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే 6 రెట్ల వృద్ధి నమోదైందని వివరించింది. అమెజాన్ ప్రకారం, హైదరాబాద్తో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వరంగల్ నగరాల నుంచి కూడా భారీ డిమాండ్ ఉంది.
హోమ్ అండ్ కిచెన్ , వుమెన్స్ ఫ్యాషన్ , ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ ప్రొడక్ట్ల కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. అమెజాన్ బజార్లో ప్రొడక్ట్ల ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉచిత డెలివరీ, క్యాష్బ్యాక్ ఆఫర్లతో బడ్జెట్ కస్టమర్లను ఇది ఆకట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 వేల మందికి పైగా సెల్లర్లు ఉండగా, అమెజాన్ బజార్లో విక్రేతల సంఖ్య 2.4 రెట్లు పెరిగింది. నిరంతర సరఫరా కోసం ఈ ప్రాంతంలో 8 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 3 సార్టేషన్ సెంటర్లు, 1,500 మంది హబ్ డెలివరీ భాగస్వాములతో నెట్వర్క్ను విస్తరించామని అమెజాన్ ఇండియా తెలిపింది.
