సూర్యాపేటలో దారుణం.. నోట్లో గుడ్డలు కుక్కి, 8 ఏండ్ల బాలికపై అత్యాచారం    

సూర్యాపేటలో దారుణం.. నోట్లో గుడ్డలు కుక్కి, 8 ఏండ్ల బాలికపై అత్యాచారం     
  • న్యాయం చేయాలంటూ కలెక్టర్ ను ఆశ్రయించిన బాధితులు

సూర్యాపేట వెలుగు: 8 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సూర్యాపేటలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో తాపీ పని చేసే సత్తు రాజు.. పక్కింట్లో ఉండే 8 ఏళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి, అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. అదే సమయంలో అమ్మయి తండ్రి ఇంటికి రావడంతో.. నిందితుడు రాజు పరారయ్యాడు. విషయం బయటకు చెప్పుకోలేక ఒక రోజంతా కుమిలిపోయిన బాధిత కుటుంబసభ్యులు గురువారం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత డీఎస్పీ మోహన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆశ్రయించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 ఏండ్ల బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు డిమాండ్ చేశారు.