ఏపీలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు: అనర్హులుగా 8 మంది ఎమ్మెల్యేలు

ఏపీలో పార్టీ  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు:  అనర్హులుగా 8 మంది ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పిరాయించారంటూ వైదొలగాలని కోరుతూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్, వాసుపల్లి గణేష్‌పై అనర్హత వేటు పడింది. టీడీపీ, వైసీపీల బాధలు, ఎమ్మెల్యేల ప్రకటనలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ఎనిమిది మంది సభ్యులు పార్టీ పిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్‌ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీతో జట్టుకట్టారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్లు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్‌ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.