అంగన్​వాడీల్లో ఎగ్ బిర్యానీ.. టీచర్లకు కొత్త సెల్​ఫోన్లు

అంగన్​వాడీల్లో ఎగ్ బిర్యానీ.. టీచర్లకు కొత్త సెల్​ఫోన్లు
  • వారంలో ఒకట్రెండు సార్లు వడ్డించేలా మెనూలో మార్పులు: సీతక్క
  • ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు
  • పని ఒత్తిడి తగ్గించేందుకు 14వేల ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ పిల్లలకు వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని సంబంధిత శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మేధోమథనం సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు. 

తమ అనుభవాలు, ఆలోచనలను పలువురు డీడబ్ల్యూవోలు, సీడీపీవోలు, సూపర్​వైజర్లు మంత్రి, అధికారులకు వివరించారు. అంగన్​వాడీ చిన్నారుల కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ ను సీతక్క పరిశీలించి అభినందించారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ ను రూపొందించి ప్రతి అంగన్​వాడీ కేంద్రానికి అందజేస్తామని మంత్రి తెలిపారు. ‘‘అంగన్​వాడీ చిన్నారులకు అందజేసే స్నాక్స్, బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలి. నిరుడు కంటే ఈ ఏడాది 25 శాతం అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలి. 

బడి గంట తరహాలోనే అంగన్​వాడీ కేంద్రాల్లోనూ బెల్లు విధానం తీసుకురావాలి. పొద్దున గంట మోగిస్తే.. చిన్నారుల్లో ఉత్సాహం, క్రమశిక్షణ పెరుగుతది. టీచర్లు, హెల్పర్లు కరెక్ట్ టైమ్​కు వచ్చే అవకాశం ఉంటుంది’’అని సీతక్క అన్నారు. 

ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్​వాడీ కేంద్రాలు

అంగన్​వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ‘‘అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లు దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మినీ అంగన్​వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచినం. అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు గ్రీన్ ఛానల్ లో ప్రతినెలా అందించేందుకు కృషి చేస్తా. పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణ వల్ల లేట్​ అయింది. ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్​వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలి’’అని సీతక్క అన్నారు. 

‘అమ్మమాట అంగన్​వాడీ బాట’ నిర్వహించాలి

అంగన్​వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడ్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. కోడి గుడ్డును ఉడకబెట్టి అలాగే ఇవ్వకుండా.. 2 ముక్కలు చేసి ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. 

‘‘అంగన్​వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ‘అమ్మమాట అంగన్​వాడి బాట’ కార్యక్రమాన్ని చేపట్టాలి. చిన్నారులకు క్రమశిక్షణ నేర్పించే బాధ్యత అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లదే. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంగన్​వాడీకి వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలి. వాళ్లు కూర్చునేందుకు బెంచీలు అందజేస్తాం. టీచర్లకు కొత్త సెల్​ఫోన్లు అందజేస్తాం. చిన్నారులకు అందిస్తున్న భోజనం మరింత రుచికరంగా మారుస్తాం’’అని మంత్రి సీతక్క వెల్లడించారు.