ఈటలకు అంజన్​ కుమార్ యాదవ్​ వార్నింగ్​

ఈటలకు అంజన్​ కుమార్ యాదవ్​ వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని పీసీసీ వర్కింగ్​  ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్​ కుమార్​ యాదవ్​  హెచ్చరించారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రమాణం చేస్తే.. ఈటల పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​తో కలిసి ఆదివారం గాంధీ భవన్​లో మీడియాతో అంజన్ కుమార్​ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విడదీసి పాలించే బీజేపీలో చేరిన ఈటల.. రేవంత్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మల్లు రవి అన్నారు.

భాగ్యలక్ష్మి దేవాలయాన్ని రాజకీయాల్లోకి తెచ్చిందే బీజేపీ నేతలు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్​లోని మెజారిటీ నాయకులు ఎన్నుకుంటే రేవంత్​ పీసీసీ చీఫ్​  అయ్యారని పేర్కొన్నారు. దయాకర్  మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలతో రేవంత్​ను కన్నీళ్లు పెట్టించే వరకు తీసుకొచ్చారని ఈటలపై ఫైర్  అయ్యారు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడారన్నారు. అసెంబ్లీలో ఈటలను కేసీఆర్, కేటీఆర్​, హరీశ్​రావు పొగిడి మాట్లాడినప్పుడే ఆయన ఏ పార్టీకి తొత్తో అర్థం అయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ, ఈటల అవినీతిపరుడని, స్వార్థపరుడని అన్నారు. ప్రజల కోసం రేవంత్ కొట్లాడినందుకే ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిందన్నారు. ఈటల రెడ్డినా.. బీసీనా చెప్పాలని ఆయన నిలదీశారు. మిషన్​ కాకతీయ, మిషన్​ భగీరథ పథకాలకు సంబంధించిన పేపర్లపై సంతకాలు పెట్టి నిధులు విడుదల చేసిందే ఈటలే అని, అవినీతిలో ఆయనకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.