యంగ్ ఇండియా లిమిటెడ్ కు రేవంత్ సూచన మేరకు విరాళాలు ఇచ్చా : అంజన్ కుమార్ 

యంగ్ ఇండియా లిమిటెడ్ కు రేవంత్ సూచన మేరకు విరాళాలు ఇచ్చా : అంజన్ కుమార్ 

హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్ కు విరాళాలు ఇచ్చానని ఈడీ అధికారులకు తెలియజేశానని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే స్వచ్చందంగా విరాళాలు ఇచ్చానని తెలిపారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు కాంగ్రెస్ నేతలను విచారిస్తున్నారని చెప్పారు. మళ్లీ విచారణ ఉంటే పిలుస్తామని ఈడీ అధికారులు తనకు తెలియజేశారని అన్నారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇవాళ ఈడీ ముందుకు హాజరైన విషయం తెలిసిందే. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం అంజన్ కుమార్ యాదవ్ ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత నెల 3వ తేదీనే అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.... అనారోగ్యం కారణంగా ఆయన హాజరు కాలేదు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాలు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నేపథ్యంలో ఈడీ ఈ కేసుపై దర్యాప్తు చేపట్టింది. జూన్‌లో వరుసగా మూడు రోజుల పాటు దేశ రాజధానిలో జరిగిన విచారణకు సోనియా హాజరయ్యారు. వాటన్నింటికీ ఆమె సంతృప్తికరమైన వివరణలు ఇచ్చారని అప్పట్లో ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారని, వాటన్నింటికీ సోనియాగాంధీ సరైన సమాధానాలు ఇచ్చారని స్పష్టం చేశాయి.