ఉచిత హామీలపై సుప్రీం ఆందోళన

ఉచిత హామీలపై సుప్రీం ఆందోళన

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అవి ఇస్తాం.. ఇవి ఇస్తామంటూ ఉచిత హామీలు గుప్పిస్తుంటాయనే సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇలాంటి హామీలు ప్రమాదకరంగా అభివర్ణించింది. వీటిని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఉచితాల కోసం రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై జనవరి 25వ తేదీన సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం దీనిపై విచారణ జరిపింది. హామీలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయనే విషయాన్ని సుప్రీం గుర్తు చేసింది.

ఉచితాలపై నిషేధం విధించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకరావాల్సి ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉచిత హామీలపై ఈసీనే ఓ నిర్ణయం తీసుకోవాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ తెలిపారు. రాతపూర్వకంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశ్నించారు. ప్రభుత్వం తన వైఖరి తెలిపితే వీటిని కొనసాగించడమా ? లేదా ? అనేది తాము నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాదే కాకుండా సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారని.. దీనిని నియంత్రించడానికి ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయ అంశాలు ఇమిడి ఉండడం వల్ల ఉచితాలపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదన్నారు.  మొత్తం రూ. 6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు.. భారతదేశం మరో శ్రీలంకగా మారే అవకాశం ఉందని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వాదించారు. తదుపరి విచారణను ఆగస్టు 03వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది.