సూసైడ్‌ చేసుకున్న మరో నటుడు

సూసైడ్‌ చేసుకున్న మరో నటుడు
  • కుళ్లిన స్థితిలో కనిపించిన మృతదేహం

ముంబై: హిందీ సినీపరిశ్రమలో మరో విషాదం జరిగింది. టీవీ సీరియల్‌ నటుడు సమీర్‌‌ శర్మ (44) చనిపోయాడు. ముంబైలోని మలాద్‌లోని ఆయన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలోఉందని పోలీసులు చెప్పారు. సూసైడ్‌ నోట్‌ సహా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో సొంత ఫ్లాట్‌లో ఉండే సమీర్‌‌ శర్మ ఈ ఫిబ్రవరిలోనే అద్దె ఫ్లాట్‌కు షిఫ్ట్‌ అయ్యారని అన్నారు. సమీర్‌‌ శర్మ హసీతో ఫసీ, కహానీ ఘర్‌‌ ఘర్‌‌ కీ, క్యోంకీ సాస్‌ భీ కభీ బహూ ధీ లాంటి సీరియళ్లలో నటించారు. ప్రస్తుతం అతను ఓ ప్రముఖ చానల్‌లో టెలికాస్ట్‌ అవుతున్న యే రిష్తే హై ప్యార్‌‌కే సీరియల్‌లో నటిస్తున్నారు. కాగా.. సమీర్‌‌ మూడు రోజుల నుంచి బయట కనిపించకపోవడం, ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో గమనించిన వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫ్లాట్‌కు వచ్చిన పోలీసులు ఉరివేసుకుని కనిపించారు. ఫ్లాట్‌లో సోదాలు జరిపిన పోలీసులు ఆధారాల కోసం వెతుకుతున్నారు.