ఛత్తీస్‌గఢ్‌‎లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌‎లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్‎గఢ్‎లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శనివారం (జూన్ 7) మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా భద్రతా దళాలు ఛత్తీస్ గఢ్‎లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. 

ఈ క్రమంలోనే శనివారం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరగగా.. ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

తాజా ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల్లో ఓ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతోన్న విషయం తెలిసిందే. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఎన్ కౌంటర్లో పార్టీ అగ్రనేతలు మరణించారు. మావోయిస్ట్ పార్టీ చీఫ్, సుప్రీం కమాండర్ నంబాల కేశవ్, అడెల్లు భాస్కర్ వంటి అగ్రనేతలు ఎన్ కౌంటర్లో హతమయ్యారు. ఇదిలా ఉండగానే తాజాగా మరో ఐదుగురు నక్సలైట్లు ఎన్ కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.