అక్రమాల్లోనూ రెండు రకాలు: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరో కొత్త కోణం

అక్రమాల్లోనూ రెండు రకాలు: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరో కొత్త  కోణం

హైదరాబాద్: స్టేట్ పాలిటిక్స్‎ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ముమ్మరం చేసింది. ఓ వైపు నిందితులను విచారిస్తున్నానే.. మరోవైపు సాక్ష్యుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అక్రమాలు రెండు రకాలుగా సాగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

కొన్ని నెంబర్లను నేరుగా ట్యాప్ చేసిన ప్రణీత్ రావ్ అండ్ కో.. మరికొన్ని నెంబర్లను మాత్రం కాల్ డేటా రికార్డింగ్ లిస్ట్ తీసినట్లు సమాచారం. ఒక వ్యక్తి కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) తీయాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ విధించింది. ఆ నిబంధనల ప్రకారం మాత్రమే సీడీఆర్ తీయాలి. కానీ ప్రణీత్ రావ్ అండ్ టీం కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అనేక మంది సీడీఆర్‎లు తీసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రణీత్ రావ్ ఎవరెవరి నెంబర్ల కాల్ డేటా సేకరించాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

►ALSO READ | మానవ అక్రమ రవాణా కేసులో కానిస్టేబుల్ డిస్మిస్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. సాక్షుల నుంచి వరుసగా వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వంటి నేతల స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం (జూన్ 27) విచారణకు హాజరు కావాలని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ నెంబర్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్.. ఈ మేరకు ఆయనకు సమాచారం ఇచ్చింది. సాక్షిగా విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరింది.