
ఆసిఫాబాద్, వెలుగు: మానవ అక్రమ రవాణా కేసులో నిందితుడైన ఓ కానిస్టేబుల్ ను ఎస్పీ డిస్మిస్ చేశారు. నిందితుడిపై మూడు మానవ అక్రమ రవాణా కేసులున్నట్లు తెలిపారు. 1989 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్కామేరి హరిదాస్2019లో తిర్యాణి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఓ గిరిజన మహిళను మధ్యప్రదేశ్ కు అమ్మిన కేసులో నిందితుడు. 2025లో ఆదివాసీ మహిళను ఇద్దరి మధ్యవర్తులతో మధ్యప్రదేశ్ కు విక్రయించారు. ఈ కేసులో 9 మంది నిందితుల్లో హరిదాస్ఒకడు.
బాధిత మహిళ తండ్రి ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాధితురాలు మధ్యప్రదేశ్ లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసు బృందం బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో కానిస్టేబుల్హరిదాస్ ఏ1గా ఉన్నాడు. దీంతో అతడిని ఈనెల 16 న ఆసిఫాబాద్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. మూడు మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న హరిదాస్ ను పోలీస్ విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.