
ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లోని స్మారక మ్యూజియం వద్ద 2008 26/11 ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐక్యరాజ్యసమితి క్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నివాళులర్పించారు. గుటెర్రస్ తో పాటు..మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు కూడా ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు.
దేవికతో ..గుటెర్రెస్ మీట్..
ముంబై ఉగ్రదాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ దేవిక రోటవాన్ను ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెర్రెస్ను కలిశారు. ఉగ్రదాడి బాధితురాలు దేవికతో కాసేపు ముచ్చటించారు.తాను ఉగ్రదాడిలో గాయపడినట్లు ఆంటోనియో గుటెర్రెస్ కు చెప్పానని దేవిక వివరించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో గాయపడ్డానని తెలిపింది. అలాగే కోర్టులో అజ్మల్ కసబ్ ను గుర్తించినట్లు గుటెర్రెస్ కు తెలిపినట్లు దేవిక వెల్లడించింది.
ఉగ్రవాదానికి చోటు లేదు
టెర్రరిజం ఓ భూతమని ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఏ కారణాలు సమర్థించలేవని చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదని చెప్పారు. తాను హేయమైన ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో ఉన్నానని.. దీని పట్ల చాలా చింతిస్తున్నానన్నారు. నాటి ఉగ్రదాడిలో సుమారు 166 మంది మరణించినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్ చెప్పారు. టెర్రరిజంపై పోరాటం ప్రతి దేశానికి ప్రాధాన్యత కావాలని సూచించారు. ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్యరాజ్యసమితి ఎప్పుడూ మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు.
గుజరాత్లో పర్యటన
మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ కు చేరుకున్న ఆంటోనియో గుటెర్రెస్..తాజ్ హోటల్ వద్ద నివాళి అర్పించారు. ఆ తర్వాత ఐఐటీ ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గురువారం గుజరాత్లోని కేవడియాలో ప్రధాని మోదీతో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఇందులో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి నివాళి అర్పించనున్నారు. అనంతరం దేశంలోనే తొలి సోలార్ పవర్ గ్రామాన్ని సందర్శిస్తారు.