8 నెలలుగా ఐఏఎస్ల పాలనలో యూనివర్సిటీలు
ఆరేండ్లుగా పాలక మండళ్లు లేని దుస్థితి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు మూడు వారాల్లోగా వైస్ చాన్స్లర్లను నియమించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకుని, తొలుత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు పూర్తి చేయాలన్నారు. దానివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని సూచించారు. సీఎం ఆదేశాలతో వర్సిటీ వీసీల నియామకాలపై కదలిక వచ్చింది.
పదకొండు వర్సిటీలకు
రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని పదకొండు వర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. పదింటికి ఐఏఎస్లు ఇన్చార్జులుగా ఉండగా.. ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి ఇన్చార్జి కూడా లేరు. శాతవాహన వర్సిటీకి ఐదేండ్లుగా, ఆర్జీయూకేటీకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇన్చార్జి వీసీలే కొనసాగుతుండటం గమనార్హం. గతేడాది జూన్ 23న ఫైన్ఆర్ట్స్, ఆర్జీయూకేటీ మినహా మిగతా తొమ్మిది వర్సిటీల వీసీ పోస్టుల కోసం సర్కారు దరఖాస్తులను ఆహ్వానించింది. వాటికోసం 273 మంది ప్రొఫెసర్లు 984 అప్లికేషన్లు పెట్టుకున్నారు. అత్యధికంగా అంబేద్కర్ఓపెన్వర్సిటీకి 142 దరఖాస్తులు వచ్చాయి. ప్రధాన వర్సిటీలైన ఓయూకు 114, కేయూకు 110, జేఎన్టీయూకు 56 అప్లికేషన్లు రాగా.. తెలంగాణ వర్సిటీకి 114, శాతవాహనకు 125, పాలమూరుకు 122, మహాత్మాగాంధీ వర్సిటీకి 124 అప్లికేషన్లు వచ్చాయి. గతంలోనే ప్రభుత్వం ఒక్కో వర్సిటీకి ముగ్గురి చొప్పున సెర్చ్కమిటీలను వేసింది. ఇప్పటికీ సెర్చ్ కమిటీల సమావేశం జరగలేదు. తాజాగా సీఎం ఆదేశాల నేపథ్యంలో సెర్చ్ కమిటీల సమావేశాలు జరుగనున్నాయి.
ఈసీ ప్రతిపాదనలు సర్కారు వద్ద..
రాష్ట్రంలో కాకతీయ వర్సిటీకి మినహా ఏ వర్సిటీకి కూడా పాలకమండళ్లు లేవు. కాకతీయ వర్సిటీకి కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవలే నియమించారు. 2014 నాటికే దాదాపు అన్ని వర్సిటీ పాలక మండళ్ల కాలపరిమితి ముగిసింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వర్సిటీలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా పూర్తిస్థాయి ఈసీ ఆమోదం తప్పనిసరి. వీసీల నియామకానికి సంబంధించి వర్సిటీ తరఫు నామినీని ఈసీ ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ముందు ఈసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కమిటీల ప్రతిపాదనలను డిసెంబర్లోనే సర్కారుకు పంపినా.. ఇప్పటివరకు పెండింగ్ లోనే ఉన్నాయి.