- మూడో ర్యాంకర్కు సాత్విక్–చిరాగ్ జోడీ షాక్..
టోక్యో: ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీలో తొలి రోజు నిరాశ మిగిలింది. మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ జోడీ క్వార్టర్ ఫైనల్లోనే తమ పోరాటాన్ని ముగించింది. శనివారం జరిగిన క్వార్టర్స్లో ఇండియా 2–6 తేడాతో కొరియా జోడీ కిమ్ జి డిక్–యాన్సన్ వాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నాకౌటైంది. ఇక, మెయిన్ ఈవెంట్కు ఒక్క రోజు ముందు దీపికా కుమారి జోడీని మార్చడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భర్త అటాను దాస్తో కలిసి దీపిక మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో బరిలోకి దిగాల్సి ఉంది. కానీ ర్యాంకింగ్ రౌండ్ రిజల్ట్ ఆధారంగా అటానును తప్పించిన టీమ్ మేనేజ్మెంట్ ప్రవీణ్ జాదవ్ను దీపిక జోడీగా ఎంపిక చేసింది. దీనిపై దీపిక కూడా నిరాశ వ్యక్తం చేసింది.
సెకండ్ రౌండ్కు నగాల్
టెన్నిస్లో ఇండియా శుభారంభం చేసింది. మెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో సుమిత్ నగాల్ 6–4, 6–7(6), 6–4తో ఇస్టోమిన్(ఉజ్బెకిస్తాన్)తో గెలిచాడు. దీంతో 25 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్లో సింగిల్స్ మ్యాచ్ గెలిచిన తొలి ఇండియన్గా నిలిచాడు.
ప్రణీత్ ఫ్లాప్.. సాత్విక్ సెన్సేషన్
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్లో సాత్విక్ సాయి రాజ్– చిరాగ్ శెట్టి అదిరిపోయే పెర్ఫామెన్స్ చేస్తే.. మెన్స్ సింగిల్స్లో బి.సాయిప్రణీత్ ఫస్ట్ మ్యాచ్లో ఓడి నిరాశపరిచాడు. మెన్స్ డబుల్స్ గ్రూప్–ఎలో భాగంగా జరిగిన మ్యాచ్లో సాత్విక్–చిరాగ్శెట్టి జోడీ 21–16, 16–21, 27–25తో వరల్డ్ మూడో ర్యాంకర్, మూడో సీడ్ యాంగ్ లీ– లిన్ వాంగ్ (తైపీ) కు షాకిచ్చింది. కానీ, మెన్స్ సింగిల్స్ గ్రూప్–డి ఫస్ట్ మ్యాచ్లో 13వ సీడ్ ప్రణీత్ 17–21, 15–21తో 47వ ర్యాంకర్ మిషా జెబ్బర్మెన్(ఇజ్రాయిల్) చేతిలో వరుస గేమ్స్లో ఓడాడు.
శరత్-బాత్రా జోడీకి నిరాశ
టేబుల్ టెన్నిస్లో మెడల్ ఖాయం అనుకున్న మిక్స్డ్ డబుల్స్లోశరత్ కమల్– మనికా బాత్రా జోడీ నిరాశ పరిచింది. ఫస్ట్ రౌండ్లో 12వ సీడ్ శరత్– మనికా జంట 8–-11, 6–-11, 5–-11, 4–-11తో మూడో సీడ్, లిన్యున్జు-– చెంగ్ ఐ చింగ్ (తైపీ) చేతిలో చిత్తయి ఇంటిదారి పట్టింది. అయితే, విమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ గెలిచారు.
హాకీ మెన్స్ టీమ్ గెలుపు.. విమెన్స్ టీమ్ ఓటమి
మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా మెన్స్ హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్ను విజయంతో ఆరంభించింది. పూల్–ఎలో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇండియా 3–2 తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, రూపిందర్ పాల్ ఓ గోల్ కొట్టాడు. గోల్ కీపర్ శ్రీజేశ్ కూడా ఆకట్టుకున్నాడు. విమెన్స్ పూల్–ఎ మ్యాచ్లో ఇండియా 1–5 తేడాతో వరల్డ్ నంబర్వన్ నెదర్లాండ్స్ చేతిలో
చిత్తుగా ఓడింది.
సౌరభ్ గురి తప్పింది..
మెన్స్ 10 మీటర్ల ఎయిర్పిస్టల్ ఈవెంట్ ఫైనల్ను సౌరభ్ చౌదరి ఏడో స్థానంలో ముగించి నిరాశ పరిచాడు. క్వాలిఫికేషన్లో టాపర్గా నిలిచిన సౌరభ్ ఫైనల్లో కేవలం 137.4 పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. మరో షూటర్ అభిషేక్ వర్మ క్వాలిఫికేషన్ రౌండ్ దాటలేకపోయాడు. అలాగే, విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లోనూ వరల్డ్ నంబర్ వన్ ఎలవెనిల్, అపూర్వి చండీలా క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగారు.
సుశీల, వికాస్ ఔట్
జుడోలో ఏకైక ప్లేయర్ సుశీలా దేవీ (విమెన్స్ 48 కేజీ) ఫస్ట్ రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. బాక్సింగ్లో వికాస్ క్రిషన్(69 కేజీ) కూడా ఫస్ట్ రౌండ్ దాటలేకపోయాడు. ఇక, రోయింగ్ మెన్స్ లైట్వెయిట్ డబుల్ స్కల్ట్స్లో అరవింద్– అర్జున్ రెపిఛేజ్కు క్వాలిఫై అయ్యారు.