
- ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు
- బెంగళూరు సీపీ దయానంద వెల్లడి
బెంగళూరు: నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో ఇద్దరు తెలుగు నటులు పాల్గొన్నారని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. ఈ ఈవెంట్లో పాల్గొనడానికి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేశారని.. దాదాపు వంద మంది పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనలేదని కమిషనర్ వెల్లడించారు. 'సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ' పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర మాట్లాడుతూ..రేవ్పార్టీలో కోట్ల రూపాయల విలువైన కొకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
కర్ణాటకను డ్రగ్స్ఫ్రీగా మార్చాలని చేసే ప్రయత్నాలు పొరుగు రాష్ట్రాల పెడ్లర్ల కారణగా విఫలమవుతున్నాయని అన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తామని అన్నారు. బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో తాము పాల్గొనలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్ వీడియోలు విడుదల చేశారు. అయితే ఇవాళ సీపీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నటుల పేర్లు వెల్లడించకపోవడం గమనార్హం.