న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ స్కీంను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో కేరళ, హర్యానా, జార్ఖండ్, యూపీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. సెక్యూరిటీ ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి.
హర్యానా..
ఫరీదాబాద్ సిటీలో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను గుర్తించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేరళలో ఆందోళనల పేరుతో హింసకు పాల్పడుతూ కనిపించిన వాళ్లను అక్కడికక్కడే అరెస్టు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీ ఆదేశాలిచ్చారు. దుకాణాలను బలవంతంగా మూసేయించే ప్రయత్నాలను అడ్డుకోవాలని జిల్లా పోలీస్ బాస్లకు సూచించారు. జార్ఖండ్లో అన్ని స్కూల్స్కు సోమవారం సెలవు ప్రకటించినట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మీడియాకు తెలిపారు.
ఉత్తరప్రదేశ్...
గౌతమ బుద్ధ నగర్లో ఇప్పటికే అమలులో ఉన్న 144 సెక్షన్ను పొడిగిస్తున్నట్లు యూపీ పోలీసులు ప్రకటించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పంజాబ్లో భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా సోషల్ మీడియా గ్రూపులపై నిఘా పెట్టాలని పోలీసులకు అక్కడి ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) ఆదేశాలు జారీ చేశారు.