- టెర్రరిస్టులను సరిహద్దు దాటించడమే పని
- టెర్రరిస్టులకు వెన్నుదన్నుగా పాక్ బోర్డర్ యాక్షన్ టీం
సరిహద్దులో భారత సైన్యం కదలికలపై కన్నేయడం.. ఎక్కడ? ఎప్పుడు? బోర్డర్దాటేందుకు వీలవుతుందో పక్కా ప్లాన్ చేసుకోవడం.. ఆ తర్వాత గస్తీ కాస్తున్న ఇండియన్ఆర్మీపైకి కాల్పులు జరపడం.. సందు చూసుకుని ఉగ్రవాదులు సరిహద్దు దాటి ఇండియాలోకి చొరబడటం.. పొరుగుదేశం పాకిస్తాన్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహం ఇది! అయితే, టెర్రరిస్టులను సరిహద్దులు దాటించే కుట్రల వెనక సాక్షాత్తూ ఆ దేశ ఆర్మీయే ప్రధాన పోత్ర పోషిస్తుంటుంది. ఆ యాక్షన్ ప్లాన్ మొత్తం అమలు చేసేది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్టీం (బ్యాట్), స్పెషల్సర్వీస్ గ్రూప్(ఎస్ఎస్జీ) కమాండోలే. బుధవారం రాత్రి ఇలాంటి ఓ చొరబాటు కుట్రనే దీటుగా తిప్పికొట్టి, ఏడుగురిని మట్టుబెట్టినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
బ్యాట్ ప్లాన్.. ఎస్ఎస్జీ ఆచరణ
పాక్నుంచి టెర్రరిస్టులను పంపే ముందు మొత్తం ప్లాన్ను బ్యాట్ సిద్ధం చేస్తుంది. సరిహద్దులో ఎక్కడ చొరబడేందుకు ఈజీగా ఉంటుంది? ఏ సమయంలో భారత సైనికులు ఆ చోటులో ఉండరు? చొరబడిన తర్వాత భారత సైనికుల కన్నుగప్పి ముందుకు వెళ్లడం ఎలా? ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఎదురుపడితే దాక్కోవడం ఎలా? 778 కిలోమీటర్ల పొడవైన ఎల్ఓసీ వెంబడి ఇలాంటివన్నీ చూసుకుని, ప్లేస్ ఎంపిక చేసుకున్నాక బ్యాట్ ఫైనల్గా ఆపరేషన్ ప్రారంభిస్తుంది. బ్యాట్ప్లాన్అమలు చేసేందుకు ఎస్ఎస్జీ కమాండోలు రంగంలోకి దిగుతారు. ఒక్కో విడత వీరు ఐదు నుంచి ఏడుగురు మాత్రమే టీంగా బయల్దేరతారు. అనుకున్న ప్లాన్ప్రకారం, వీరు టెర్రరిస్టులను వెంటేసుకుని చొరబడేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఇండియన్ సైనికులు ఎదురైతే వీరు కాల్పులు జరుపుతూ, ఉగ్రవాదులను బోర్డర్ దాటిస్తారు. టెర్రరిస్టులు ఇండియాలోకి దూరగానే తిరిగి వెనక్కి వెళ్లిపోతారు.
నల్లకొంగలు.. నరహంతక ముఠాలు
ఎస్ఎస్జీ కమాండోలు నల్లటి దుస్తులు ధరిస్తుంటారు. అందుకే వీరిని నల్ల కొంగలు అని పిలుస్తుంటారు. కార్గిల్లో 1999లో వీరే ముందుగా బోర్డర్ దాటొచ్చి సురక్షిత స్థావరాలు ఏర్పాటు చేసుకుని మరీ తిష్ట వేశారు. ఆ తర్వాత పాక్సైన్యం ప్రవేశించి, కయ్యానికి కాలుదువ్వింది. అయితే, వీరు చొరబాట్లు, కాల్పులు జరపడమే కాదు.. ఇండియన్ సైనికులు చిక్కితే అతి కిరాతకంగా వ్యవహరిస్తుంటారు కూడా. వీరు 2017 మే నెలలో పూంచ్ జిల్లాలోని క్రిష్ణా ఘటి సెక్టార్లో ఇద్దరు భారత సైనికులు బందీలుగా దొరికితే, వారి తలలను నరికివేశారు. ఈ ఆటవిక దుశ్చర్యపై ప్రపంచమంతా దుమ్మెత్తిపోసింది. అంతకుముందు 2013 జనవరిలో లాన్స్నాయక్హేమరాజ్, లాన్స్నాయక్ సుధాకర్ సింగ్లు బందీలుగా దొరకడంతో పాక్ బోర్డర్ యాక్షన్ టీం సైనికులు కూడా వారి తలలను నరికివేశారు. ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాజీందర్సింగ్ గాయాలతో తప్పించుకున్నారు. ఎప్పుడూ టెర్రరిస్టులను బోర్డర్ దాటించడమే పనిగా పెట్టుకునే బ్యాట్ గత రెండేండ్లలో దాదాపుగా ఆరేడు సార్లు చొరబాట్లకు యత్నించిందని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎల్ఓసీ ఆవల 250 మంది వరకూ టెర్రరిస్టులను సరిహద్దులు దాటించేందుకు సిద్ధంగా ఉంచిందని, కానీ అప్రమత్తంగా ఉండటంతో వారి ఆటలు సాగలేదని చెబుతున్నారు.