హైదరాబాద్ / గచ్చిబౌలి, వెలుగు : అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీదే భవిష్యత్అని నోబెల్శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి పేర్కొన్నారు. గతాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)హైదరాబాద్ 22వ కాన్వొకేషన్ శనివారం శాంతిసరోవర్లోని గ్లోబల్ పీస్ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. కైలాశ్ సత్యార్థి చీఫ్గెస్టుగా హాజరై ఐఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణ్, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజారెడ్డితో కలిసి స్టూడెంట్లకు పట్టాలను అందజేశారు.
వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 9 మంది స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళను గౌరవించాలని, వారిపై జరుగుతున్న అన్యాయాలను ఎదురించి అడ్డుకునేందుకు కృషి చేయాలని స్టూడెంట్లకు సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్లో పాల్గొన్న కైలాశ్ సత్యార్థి మాట్లాడుతూ.. పోలీస్ అధికారుల్లో విధుల పట్ల అంకితభావం ఎలా ఉంటుందో ఓ పోలీస్ అధికారి కొడుకుగా తనకు తెలుసునని గుర్తుచేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి మహిళలు, చిన్నారును రక్షించడంలో తెలంగాణ పోలీసులు మొత్తం దేశానికే ఆదర్శమని అభినందించారు. డీజీపీ అంజనీ కుమార్,అడిషనల్ డీజీలు షికా గోయల్, మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, సంజయ్కుమార్ జైన్, ఐజీలు, సీపీలు, ఎస్పీలను ప్రశంసించారు.

