ఆషాఢమాసం అంటే తెలంగాణలో బోనాలు.. అమ్మవారి పూజలు .. సంబరాలు జరుపుకొని ఇంటికి వెళ్లిన తరువాత ముందుగా ప్రసాదం తిని ఆ తరువాత నోటిని తీపి చేసుకోకపోతే ఎలా. అసలే ఆడి పాడి అలసిపోయి ఉంటాం కదా.. అందుకే నోరూరించే స్వీట్లు మీకోసం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ స్వీట్లతో వేడుకల్ని మరింత మధురంగా ఎంజాయి చేయాలంటే రుచికరమైన స్వీట్లను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
పాకం గవ్వలు తయారీకి కావాల్సినవి
- మైదా లేదా గోధుమపిండి- ఒక కప్పు
- బొంబాయి రవ్వ - ఒక టేబుల్ స్పూన్
- బెల్లం తరుము- అర కప్పు
- నెయ్యి– ఒక టేబుల్ స్పూన్
- నూనె- వేగించడానికి సరిపడా
పాకం గవ్వలు తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి వేసి ముద్దలా చేయాలి. ఆ ముద్ద గట్టిగా కాకుండా. మృదువుగా ఉండేలా చూడాలి. ఆ మిశ్రమాన్ని అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఒక గిన్నెలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం వచ్చే దాక మరగనివ్వాలి. వేగించిన గవ్వలను ఆ పాకంలో వేసి కలిపితే పాకం గవ్వలు రడీ.. తింటే అదిరిపోయే రుచి.. బలం కూడా.. ఎగిరిన అలసట అంతా ఇట్టే పోతుంది..
బాదుషా తయారీకి కావాల్సినవి
- మైదా ఒక కేజీ
- వెన్న – పావుకేజీ
- బేకింగ్ పౌడర్ - రెండు టీ స్పూన్లు
- నూనె - సరిపడా
- చక్కెర - ఒక కేజీ
- నీళ్లు– తగినన్ని
- యాలకుల పొడి - ఒక టీ స్పూన్
బాదూషా తయారీ విధానం
మరుగుతున్న నీళ్లలో చక్కెర వేసి కొంచెం ముదురుపాకం వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచాలి. పాకం దగ్గరపడ్డాక యాలకుల పొడి కలిపి దింపాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వెన్న వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దగా కలపాలి. దీనిపై కాటన్ క్లాత్ కప్పి ఐదు నిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని చేత్తో బాదుషా లా అదిమి కాగేనూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. తరువాత వాటిని చక్కెర పాకంలో వేసి 15 నిమిషాలు ఉంచి తీసేయాలి. ఇవి తిన్నారంటే ఆహా ఏమి రుచిలే అంటూ మళ్లీ గంతులేస్తారు. పిల్లలు.. పెద్దలు ఇష్టంగా తింటారు.
