
ఢాకా: బంగ్లాదేశ్ గాడ్ ఫాదర్ షేక్ ముజీబుర్ రెహమాన్ వందో జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రెండు టీ20 మ్యాచ్ల కోసం మరికొంత మంది క్రికెటర్లను ఎంపిక చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ను ఆసియా ఎలెవన్లోకి తీసుకున్నారు. అయితే కోహ్లీ ఎన్ని మ్యాచ్లు ఆడతాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తన షెడ్యూల్ను బట్టి ఒకే ఒక్క మ్యాచ్ ఆడే చాన్స్ కనిపిస్తున్నది. అదే జరిగితే తర్వాతి మ్యాచ్లో విరాట్ స్థానంలో రాహుల్ బరిలోకి దిగనున్నాడు. కోహ్లీ ఆడాలని బంగ్లా బోర్డు కోరుకుంటుండగా.. బీసీసీఐ నుంచి ఎలాంటి హామీ రాలేదు. ‘బీసీసీఐ మాకు నలుగురి పేర్లు పంపించింది. ఇంకా కాంట్రాక్ట్పై సంతకాలు చేయలేదు. రిషబ్, కుల్దీప్, ధవన్, షమీ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ కోహ్లీ ఒక మ్యాచ్ ఆడితే.. రెండో మ్యాచ్లో రాహుల్ ఉంటాడని చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం జరగలేదు’ అని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ వెల్లడించారు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, డాషింగ్ హిట్టర్ క్రిస్ గేల్, పొలార్డ్ను.. వరల్డ్ ఎలెవన్లోకి తీసుకున్నారు. మార్చి 21, 22న ఆసియా, వరల్డ్ ఎలెవన్ల మధ్య ఈ రెండు టీ20లు జరుగుతాయి.
జట్లు: ఆసియా ఎలెవన్: రాహుల్, ధవన్, కోహ్లీ, పంత్, కుల్దీప్, షమీ, తిసారా పెరీరా, మలింగ, రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్, తమీమ్, లిటన్ దాస్, సందీప్ లామిచానె, మహ్మదుల్లా.
వరల్డ్ ఎలెవన్: అలెక్స్ హేల్స్, క్రిస్ గేల్, డుప్లెసిస్, పూరన్, బ్రెండన్ టేలర్, బెయిర్స్టో, పొలార్డ్, కాట్రెల్, ఎంగిడి, టై, మెక్లెనగన్.