అద్దెకు ఇల్లు కావాలని అడిగి.. బంగారం కొట్టేశారు

అద్దెకు ఇల్లు కావాలని అడిగి.. బంగారం కొట్టేశారు

ఎల్బీనగర్, వెలుగు: రెంటుకు ఇల్లు కావాలని వెళ్లి ఇంటి యజమాని మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ముగ్గురిని ఎల్బీనగర్​ పోలీసులు అరెస్ట్ ​చేశారు. రాచకొండ సీపీ మహేశ్​భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం పద్మపాణి ఆచార్య మార్గ్​లో ఉండే ఎ.రాజ్యలక్ష్మి(68) తన ఇంటిని రెంటుకు ఇచ్చేందుకు గత నెల 28న టూ లెట్​పెట్టింది. జూబ్లీహిల్స్ కు చెందిన వెంకట శేషయ్య(43) పాత నేరస్థులైన యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన మహ్మద్ అహ్మద్(24), మేడ్చల్ జిల్లా చింతల్ కు చెందిన ముప్పిడి హరిబాబు(28)తో కలిసి రాజ్యలక్ష్మి ఇంట్లో చోరీకి స్కెచ్​వేశాడు. 31న తమకు ఇల్లు అద్దెకు కావాలంటూ శేషయ్య వెళ్లాడు. ఇల్లు మొత్తం తిరిగి చూసి వచ్చేశాడు. ఈ నెల 1న అహ్మద్, హరిబాబును చోరీకి పంపించాడు. మొదట ఇద్దరూ టూలెట్​చూసి వచ్చామని చెప్పి రాజ్యలక్ష్మిని నమ్మించారు. దాహం వేస్తోంది కొంచెం మంచినీళ్లు ఇస్తారా అని అడిగి, తీసుకురావడానికి వెళ్లగానే ఆమెను వెంబడించి రాజ్యలక్ష్మి మెడలోని 6 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. 6 తులాల గోల్డ్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.