
వికారాబాద్, వెలుగు: జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్ పేట మండలంలోపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మోమిన్పేటలో రూ.80 లక్షలతో నిర్మించిన డీసీసీబీ భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తున్నాయన్నారు. పదేళ్లుగా సరైన రోడ్లు లేక కొన్ని గ్రామాల యువకులకు పిల్లను కూడా ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి ఉండేదన్నారు. అందుకే ముందుగా రోడ్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
రూ.వెయ్యి కోట్లతో అనంతగిరి కొండను అభివృద్ధి చేసేందుకు మెగా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. అనంతరం రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమాన్ని మోమిన్పేట రైతు వేదిక నుంచి స్పీకర్ వీక్షించారు. ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్తయ్య, జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్లు కిషన్ నాయక్, అంజిరెడ్డి, మొగులయ్య, మార్కెట్ చైర్మన్ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు విష్ణువర్ధన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.