పెర్త్: ఆస్ట్రేలియా విమెన్స్తో శుక్రవారం ప్రారంభమైన ఏకైక టెస్ట్లో ఇండియా అమ్మాయిలు బ్యాటింగ్లో తడబడ్డారు. జెమీమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా.. మిగతావాళ్ల నుంచి పెద్దగా సహకారం అందలేదు. దాంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 62.4 ఓవర్లలో 198 రన్స్కే ఆలౌటైంది.
తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఆట ముగిసే టైమ్కు తొలి ఇన్నింగ్స్లో 27 ఓవర్లలో 96/3 స్కోరు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బ్యాటింగ్), సదర్లాండ్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జార్జియా వోల్ (2), ఫోబీ లిచ్ఫీల్డ్ (9), అలీసా హీలీ (13) నిరాశపర్చారు. సయాలీ 2 వికెట్లు తీసింది. ప్రస్తుతం హోమ్ టీమ్ ఇంకా 102 రన్స్ వెనకబడి ఉంది.
బౌలర్లు ‘కంగారు’ పెట్టారు..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియాను కట్టడి చేయడంలో ఆసీస్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. సదర్లాండ్ (4/46), లూసీ హామిల్టన్ (3/31), డార్సి బ్రౌన్ (2/41) వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నారు. స్పిన్నర్లు హామిల్టన్ ఆరో ఓవర్లోనే స్మృతి మంధాన (4)ను ఎల్బీ చేసి షాకిచ్చింది. ఈ దశలో షెఫాలీ వర్మ (35), ప్రతీకా రావల్ (18) నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ 16వ ఓవర్లో సదర్లాండ్ దెబ్బకు షెఫాలీ ఔట్ కావడంతో రెండో వికెట్కు 36 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి జెమీమా ఒంటరిపోరాటం చేసింది.
కానీ రెండో ఎండ్లో రావత్తో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ (19), దీప్తి శర్మ (7) వెంటవెంటనే వెనుదిరగడంతో ఇండియా 107/5తో కష్టాల్లో పడింది. 74 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన జెమీమా, రిచా ఘోష్ (11) ఆరు బాల్స్ తేడాలో వికెట్లు ఇచ్చుకున్నారు. ఫలితంగా ఇండియా స్కోరు 150/7గా మారింది. చివర్లో కశ్వీ గౌతమ్ (34 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడం, సయాలీ (7)తో ఎనిమిదో వికెట్కు 38 రన్స్ జత చేయడంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేసింది. క్రాంతి గౌడ్ (1) నిరాశపర్చింది. గార్డ్నర్ ఒక్క వికెట్ తీసింది.
