న్యూఢిల్లీ: రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ అవాడ గ్రూప్ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని జోడించింది. దీంతో కంపెనీ కెపాసిటీ 17.7 గిగావాట్ పీక్ (జీడబ్ల్యూపీ) కి చేరింది. అంటే పీక్ టైమ్లో 17.7 గిగావాట్ల సోలార్ కరెంట్ను కంపెనీ ఉత్పత్తి చేయగలుగుతుంది.
ఇందులో 7.2 జీడబ్ల్యూపీ ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరో 10.5 జీడబ్ల్యూపీ నిర్మాణ దశలో ఉంది. అవాడ గ్రూప్ కేవలం సోలార్ పవర్కే పరిమితం కాకుండా విండ్ (గాలి), సోలార్–విండ్ హైబ్రిడ్, స్టోరేజ్ సొల్యూషన్స్పై కూడా ఫోకస్ పెంచింది. కొత్త టెక్నాలజీలను వాడుతూ 24 గంటల పాటు క్లీన్ పవర్ను అందించడం తమ టార్గెట్ అని చెబుతోంది.
17.7 జీడబ్ల్యూపీ మైలురాయిని చేరుకోవడం కంపెనీ అంకితభావానికి నిదర్శనమని, వివిధ భౌగోళిక ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్ తెలిపారు. ఇండియా క్లీన్ ఎనర్జీ వైపు మారడంలో అవాడ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
