
హైదరాబాద్: మాన్సూన్ రెగట్టా చాంపియన్షిప్ గ్రీన్ ఫ్లీట్ విభాగంలో ఆయు కుమార్, సాక్షి చౌన్కర్ దూసుకెళ్తున్నారు. హుస్సేన్సాగర్ లేక్లో జరుగుతున్న ఈ పోటీల్లో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ దత్తత తీసుకున్న హర్యానాకు చెందిన ఈ ఇద్దరు సెయిలర్లు స్వర్ణ పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. ఆయు కుమార్ బాలుర విభాగంలో అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సాక్షి మొదటి స్థానంలో ఉంది.
ప్రతికూల వాతావరణం నేపథ్యంలో గురువారం ఒక్కో రేసును మాత్రమే నిర్వహించారు. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో తనుజ– శ్రవణ్ జోడీ తమ విజయ పరంపరను కొనసాగించింది. బాలికల విభాగంలో జరిగిన ఏకైక రేసులో ఆలియా సబ్రీన్, అండర్–-18 లేజర్ విభాగంలో శరణ్య యాదవ్ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచారు.