వృద్ధురాలి కలలోకి బాబా...ఇంట్లో సమాధి నిర్మించి పూజలు

వృద్ధురాలి కలలోకి బాబా...ఇంట్లో సమాధి నిర్మించి పూజలు

కంప్యూటర్ కాలంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు. అన్ని రంగాల్లో ప్రపంచం పోటీపడుతుంటే..దేశంలోని కొందరు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. తాజాగా పాతబస్తీలో మూఢ నమ్మకాలతో ఓ వృద్ధురాలు స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. బాబా కలలోకి వచ్చాడని..600 ఏళ్లుగా భూమిలోని నిద్రిస్తున్నాని తిరిగి భూమిపైకి రావాలనుకుంటున్నానని చెప్పాడని వృద్ధురాలు వెల్లడించింది. భూమిపైకి రావాలంటే  సమాధి నిర్మించాలని చెప్పినట్లు ఆమె పేర్కొంది. 

హైదరాబాద్ పహాడీ షరీఫ్‌కు చెందిన ఓ వృద్ధురాలి కలలోకి బాబా వచ్చారట. ఆ బాబా తమ వంశం దాదాపు 600 ఏళ్లుగా ఈ భూమిలోనే నిద్రిస్తోందని..ఇప్పుడు తిరిగి భూమిపైకి రావాలని అనుకుంటోందని చెప్పాడట.  అలా రావాలంటే సమాధిని నిర్మించాలని కోరినట్లు వృద్ధురాలు పేర్కొంది. కలలో బాబా చెప్పిన మాటలను నిజమేనని నమ్మిన వృద్ధురాలు, ఆమె కుటుంబం..తమ ఇంట్లోనే సమాధిని నిర్మించారు. క్షుద్ర పూజలు చేయడం ప్రారంభించారు. ఇంట్లోంచి వింత వింత శబ్ధాలు రావడంతో వస్తూ స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

వృద్ధురాలి కుటుంబం చేస్తున్న పూజలను కొందరు స్థానికులు వ్యతిరేకించారు. వీరింతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాధి వద్దకు చేరుకున్న పోలీసులు..వృద్ధురాలితో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సమాధిని కూల్చేయాలని సూచించారు. పోలీసుల మాటలతో వృద్ధురాలి కుటుంబం సమాధిని కూల్చేసింది.