- హెచ్చరించిన యూట్యూబ్.. పలువీడియోల బ్లాక్
- ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నరు: జైరాం రమేశ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ విజయభేరి యాత్రలో భాగంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్న రాహుల్, ప్రియాంక ప్రసంగాలు ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని యూట్యూబ్ పేర్కొంది. తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. కొన్ని వీడియోలను బ్లాక్ చేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలను బ్లాక్ చేయడం తగదని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్ డీసీ మ్యాగజైన్ కీలక వ్యాసం ప్రచురించిందని, ఇండియాలో యూట్యూబ్ పాలక పక్షం చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రతిపక్ష నేతల ప్రసంగాలను, సందేశాలను కావాలని అణిచివేస్తోందని ఆరోపించారు. తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రసంగాలు ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని యూట్యూబ్ పేర్కొంటున్నదని, వాటిలో ఆత్మహత్యలకు ప్రేరేపించే అంశాలేమున్నాయో యూట్యూబ్ తెలుపాలన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తే సెన్సార్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.