
జకార్తా: 21వ సెంచరీ ఆసియాదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్) ప్రపంచ అభివృద్ధికి కేంద్ర స్థానమని అన్నారు. ఈ కూటమితో కలిసి పని చేసేందుకు ఇండియా కట్టుబడి ఉందని చెప్పారు. కనెక్టివిటీ, ట్రేడ్, డిజిటిల్ ట్రాన్స్ఫార్మేషన్ వంటి అంశాల్లో ఆసియాన్, ఇండియా మధ్య సహకారాన్ని విస్తరించేందుకు 12 పాయింట్ల ప్రపోజల్ను ప్రధాని నరేంద్ర మోదీ సమర్పించారు. రూల్స్ ఆధారిత పోస్ట్ కొవిడ్ ప్రపంచ క్రమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
గురువారం ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగిన ‘ఆసియాన్ – ఇండియా వార్షిక సమిట్’లో ఆయన పాల్గొన్నారు. గురువారం ఉదయం జకార్తా చేరుకున్న ప్రధాని.. మీటింగ్ తర్వాత సాయంత్రం ఢిల్లీకి తిరిగి బయల్దేరారు. మారీటైమ్ కోఆపరేషన్, ఫుడ్ సెక్యూరిటీపై ఉమ్మడి తీర్మానాలను ఈ సమిట్లో ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, ఓపెన్ ఇండో-పసిఫిక్ దిశగా పురోగతి సాధించడం, గ్లోబల్ సౌత్ వాయిస్ని పెంచడం అనేది అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టం అన్ని దేశాలకు సమానంగా వర్తించే ఇండో-పసిఫిక్ అవసరమని చెప్పారు.
ఆసియాన్.. మూల స్తంభం
‘‘21వ సెంచరీ ఆసియాదే. ఇది మన శతాబ్దం. ఇందుకోసం మనం రూల్స్ ఆధారిత ప్రపంచ క్రమాన్ని నిర్మించాలి. మనుషులందరి సంక్షేమం కోసం పని చేయడం అవసరం” అని మోదీ పిలుపునిచ్చారు. తమ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ మూల స్తంభమని చెప్పారు. ఆసియాన్ కేంద్రీకరణకు, ఇండో-పసిఫిక్పై దాని వైఖరికి పూర్తిగా మద్దతునిస్తుందని తెలిపారు. ‘‘భారత్, ఆసియాన్ను మన చరిత్ర, భౌగోళిక స్వరూపం కలుపుతున్నాయి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మానవ హక్కులపై గౌరవం వంటి ఉమ్మడి విలువలను కూడా మనం పంచుకుంటున్నాం. భాగస్వామ్య విలువలు, ప్రాంతీయ ఐక్యత, శాంతి, శ్రేయస్సు, బహుళ ధ్రువ ప్రపంచంలో పరస్పర విశ్వాసం కూడా మనల్ని ఒక్కచోటుకు చేరుస్తున్నాయి” అని వివరించారు.
ఇండియా చేపట్టిన ఇండో పసిఫిక్ ఇనిషియేటివ్లో ఈ కూటమికి ప్రముఖ స్థానం ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో కూడా.. మన పరస్పర సహకారంలో ప్రతి రంగంలో నిరంతర పురోగతి ఉంది. ఇది మన బలమైన బంధానికి నిదర్శనం” అని వివరించారు. ‘‘ఆసియాన్ ముఖ్యమైనది.. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరి వాయిస్ వినిపిస్తుంది. అభివృద్ధికి కేంద్రంగా ఉంది. ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది’’ అని చెప్పారు. కాగా, సౌత్ ఈస్ట్ ఆసియా దేశం ‘తైమూర్ లెస్టే’లో ఇండియన్ ఎంబసీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
ఇది యుద్ధాల కాలం కాదు
అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేసేందుకు ఉమ్మడి చర్యలు అవసరమని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రభావవంతంగా ఉంటుందని, సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (యూఎన్సీఎల్వోఎస్)కు అనుగుణంగా ఉండాలని భారతదేశం విశ్వసిస్తోందని చెప్పారు. ఈస్ట్ ఆసియా సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితిని ప్రస్తావిస్తూ.. ‘‘ఇది యుద్ధాల కాలం కాదు. చర్చలు, దౌత్యం మాత్రమే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్న మార్గాలు’’ అని చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని.. టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అతిపెద్ద సవాళ్లని అన్నారు.
ప్రధాని ప్రతిపాదించిన అంశాలు
- మల్టీ మోడల్ కనెక్టివిటీ ఏర్పాటు.
- సౌత్ ఈస్ట్ ఆసియా, ఇండియా, వెస్ట్ ఆసియా, యూరప్లను అనుసంధానిస్తూ ఎకనామిక్ కారిడార్.
- ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆసియాన్ దేశాలతో షేర్ చేసుకోవడం.
- టెర్రరిజం, టెర్రర్ ఫైనాన్సింగ్, సైబర్ డిస్క్రిమినేషన్పై ఉమ్మడి పోరు.
- గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలను పలు వేదికలపై లేవనెత్తడం.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్లో చేరాలని ఆసియాన్ దేశాలకు ఆహ్వానం.
- డిజిటల్ ఫ్యూచర్ కోసం ఆసియాన్-ఇండియా ఫండ్.
- ఎకనామిక్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆసియాన్, ఈస్ట్ ఆసియాకు మద్దతు పునరుద్ధరణ.
- జన్-ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు, నాణ్యమైన మందులను అందించడంలో భారతదేశ అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధం.
- డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూటమిలో చేరాలని ఆసియాన్ దేశాలకు ఆహ్వానం.